శిష్ట సంప్రదాయంలో నాగారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది.
వైదిక ఆచారాల్లో సర్పారాధనకు అనేక పండుగలు ఉన్నాయి.
గిరిజనులు జాతర నేపథ్యంగా అయిదు రోజులపాటు సర్పాన్ని
ఆరాధిస్తారు. ఆ గిరిజనుల పర్వమే- నాగోబా జాతర.
ఆరోగ్యం, సిరిసంపదలు అనుగ్రహించే దైవంగా సర్పాన్ని
గిరిజనులు పూజిస్తారు. సస్యరక్షణ దేవతగా సర్పాన్ని
భావిస్తారు. నాగదేవత తమను సంరక్షిస్తున్నందుకు
కృతజ్ఞతగా ఆదివాసులు ఏటా పుష్యబహుళ అమావాస్య
నుంచి అయిదు రోజులపాటు ఈ జాతర నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం
కేస్లాపూర్లో గిరిజనులు తమ ఆరాధ్య దైవాన్ని సమష్టిగా
నాగోబా జాతరలో పూజించుకొంటారు. మేడారం ‘సమ్మక్క-
సారలమ్మ’ జాతర తరవాత గిరిజనులు భారీ సంఖ్యలో
పాల్గొనే ఉత్సవమిది. రేపటి నుంచి 14వ తేదీ వరకు ఈ
జాతర కొనసాగుతుంది.
నాగోబా జాతరలో ‘మెస్రం’ అనే గోండు తెగ వంశీయులది ప్రధాన
పాత్ర. ఆ తెగవారు ఏ ప్రాంతంలో స్థిరపడినా జాతర వేళ
ఇక్కడకు తరలివస్తారు. ఆదివాసులు కేవలం కాలి నడకన,
ఎండ్ల బండ్లలో మాత్రమే విచ్చేస్తారు. కాళ్లకు
పాదరక్షలు లేకుండా ఖటోడా (సమూహ నాయకుడు) ఆదేశాల
మేరకు సంప్రదాయ ఆచారాల్ని గిరిజనులు కొనసాగిస్తారు.
జాతర ప్రారంభానికి ముందు కేస్లాపూర్ గ్రామానికి 80కి.మీ.
దూరంలో ఉన్న కలమడుగు గోదావరి రేవు నుంచి ఆదివాసులు కొత్త
కుండల్లో నీరు సేకరిస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవికి
ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా ఆలయానికి
చేరుకున్నాక, ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు నీటి
కుండల్ని కట్టి ఉంచుతారు. జాతర రోజుల్లో ఆ జలాలతో
నిత్యం నాగోబా స్వరూపానికి అభిషేకం చేస్తారు. సిరికొండ
గ్రామం నుంచి తీసుకొచ్చిన 116 మట్టికుండల్ని వరసగా
పేర్చి, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో
ఉన్న పాతాళగంగతో ఆ కుండల్ని నింపుతారు. నిరుడు నిర్మించిన
మట్టిపుట్టల్ని ఆ నీటితో తొలగించి, వాటి స్థానంలో
నాగేంద్రుడి ఏడు పడగలకు ప్రతీకగా ఏడు మట్టిపుట్టల్ని
నిర్మిస్తారు. వాటిపై సర్పాకృతుల్ని ఉంచి- ఆవుపాలు,
నవధాన్యాల్ని నివేదన చేస్తారు. ప్రధాన ఆలయంలో
అయిదు పడగలతో ఉన్న నాగోబా విగ్రహాన్ని గిరిజన
ఆచారాల ప్రకారం విలక్షణంగా అలంకరిస్తారు. జొన్నలు,
మొక్కజొన్నలతో తయారు చేసిన గటక, అంబలి,
కూరగాయలతో వండిన పదార్థాల్ని నైవేద్యంగా
సమర్పిస్తారు. నాగోబా ఆలయ ప్రాంగణంలో ఈ ఏడాది
వివాహమైన నవ దంపతులకు భేటింగ్ (భేటీ) నిర్వహిస్తారు.
పితృదేవతలను ఆరాధించి, వారికి తూమ్ (ఆత్మశాంతి)
ప్రక్రియతో దీపాలు వెలిగిస్తారు.
మెస్రం వంశానికి చెందిన నాగాయిమోతి అనే రాణికి నాగేంద్రుడు,
సర్పరూపంలోనే పుత్రుడిగా జన్మించాడంటారు. తన మేనకోడలైన
గౌరితో, నాగేంద్రుడికి వివాహం జరుగుతుంది. సర్పాకృతిలో ఉన్న
తన భర్తను ఓ బుట్టలో పెట్టుకుని గౌరి, గోదావరి
స్నానానికి వెళ్తుంది. పావన గోదావరి జల ప్రభావం వల్ల
నాగేంద్రుడు మనిషి రూపం పొందాడని చెబుతారు. గౌరి
ఆశ్చర్యంతో భర్తను తాకిన మరుక్షణమే నాగేంద్రుడు,
తిరిగి సర్పరూపంలోకి మారిపోయేసరికి- గౌరి ఆవేదనతో
గోదావరిలో కలిసిపోయిందంటారు. గిరిజనుల వంశాన జన్మించిన
తాను సదా వారిని రక్షిస్తూనే ఉంటానని నాగేంద్రుడు
అభయమిచ్చి, కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లి
అదృశ్యమయ్యాడనేది ఇక్కడి స్థలగాథ!
ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఛత్తీస్గఢ్,
ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల
నుంచీ గిరిజనులు ఈ జాతరలో పాల్గొంటారు. డోలు, కిక్రీ,
కొమ్ము వాయిద్యాలతో గిరిజనులు భక్తిపారవశ్యంతో
నృత్యాలు చేస్తారు. జాతర సందర్భంగా భక్తులు కేవలం
తెల్లటి వస్త్రాలనే ధరిస్తారు. జాతర చివరి రోజు గిరిజన
దర్బార్ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. గిరిజనుల
జీవనశైలికి, ఆచార వ్యవహారాలకు, సంస్కృతీ
సంప్రదాయాలకు, సామూహిక భక్తి చైతన్యానికి, సమష్టి
తత్వానికి, ఐకమత్య భావనకు నాగోబా జాతర సంకేతమై
నిలుస్తోంది!
జ్యోతిష్యం "శాస్త్రం". సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అందువల్లనే మనవ మరియు ప్రకృతిలో విపరీత ధుర్ఘటనలు చూస్తున్నాము. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూడనమ్మకము అన్నవాడు చెప్పలేడు. మనపై మనకు విశ్వాసం లేకపోతే, ఇతరత్రా విషయాలేవీ పెద్దగా పనిచేయవు. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు.
Showing posts with label నాగారాధనకు విశేష ప్రాముఖ్యంగల జాతర.. Show all posts
Showing posts with label నాగారాధనకు విశేష ప్రాముఖ్యంగల జాతర.. Show all posts
26 February 2016
నాగోబా జాతర
Subscribe to:
Posts (Atom)