*గుడ్డు మరియు పాలు శాఖాహారమా లేక మాంసాహారమా .
ముందుగా మనం శాకాహారం అంటే ఏమిటి? మాంసాహారం అంటే ఏమిటి? అనే విషయం పై పండితులు చెప్పిన వివరణ పరిశీలిద్దాం.
భగవంతుడు ప్రేరణ చేత ఈ భూమి పై చరాచర సృష్టి అనేది నాలుగు రకాలుగా విభజించడం జరిగినది.
అర్ధంచేసుకోబడింది.
వీటిని 1. జరాయుజములు, 2. అండజములు, 3. స్వేదజములు, 4. ఉద్భిజములు అని పిలుస్తారు.
ఈ విషయం గరుడపురాణం లో స్పష్టంగా చెప్పడం జరిగినది.
1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి. మనుష్యులు పశువులు.
2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు కోళ్ళు , పక్షులు, పాములు మొదలగునవి.
3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు. కీటకాలు ( శివుని చెమట బిందువు నుండి కుజుడు పుట్టినట్లుగా కాత్యాయని వ్రతంలో ఉంటుంది ) మొదలగునవి.
4. ఉద్భిజములు :- విత్తనము పగలదీసి జన్మించునవి చెట్లు చేమలు.
ఇక మళ్ళి ఇందులో రెండురకాలు 1 ’చర సృష్టి’, 2 . “అచర సృష్టి ” .
జరాయుజములు, అండజములు, స్వేదజములను ’చర సృష్టి’ అని,
ఉద్భిజములను మాత్రం ’అచర’ సృష్టి అని విభజించడం అయ్యింది.
చర అంటే కదిలేవి. అనగా … మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా తమ కదలికను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహారప్రయత్నంలోనూ వాడతాయి. ఇవి రజోగుణ, తమోగుణ స్వభావులు. అందువల్ల ఇవిధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమనీ’, ’మాంసమనీ’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు. ఈ నీచము అనేమాట నుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది. మన వాళ్ళు ఇప్పటికీ నీచు తిన్నాను అని అనడం మనకు తెలుసు.
ఇకపోతే ఉద్భిజములు : అనగా విత్తనము నుండి జన్మించేవి వీటిని ఉచ్చములు ( నీచముకు వ్యతిరేక పదము ) అని పిలిచారు. ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి. ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు. అందువల్ల వీటిని ’శాకాహారమని’ పిలిచారు.
చరసృష్టిని ఆహారము కొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. ఒక లేడి యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది. అంతేగానీ వేరొకకాలు మొలిపించుకోలేదు. అలాగే తనకు ఒకచోట బృతి దొరకలేదు గదా అని వేరొకచోటకు వెళ్లగలిగిన రజోగుణం లేడి, మానవుడు, పాము, నల్లి వంటి చరసృష్టి కలిగిన జంతువులలో ఉంటుంది.
కానీ అచరసృష్టి దీనికి భిన్నం. ఒక చెట్టు యొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది. చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది. చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది. అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము. ఈ అచరసృష్టి తమకు ఒకచోట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి). అందువల్ల అరటి, మామిడి, గోధుమలు, యవలు, తిలలు, వంటి వాటిని భుజిస్తే సత్వగుణ వృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.
ఇకపోతే ఈ శాఖాహార మాంసాహార చర్చ అనేది ’జరాయుజములలో’నే సాధ్యం ! మానవులు మావి నుండి పుడతారు. తల్లి పాలు తాగి పెరుగుతారు. అలాగే తోటి జరాయుజములైన ఆవులు, గేదెలు , మేకలు వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు. ఈ పాలు అనేవి తమ బిడ్డ తాగేదానికంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి. అంటే మనము పితకకపోతే ఎక్కువైనపాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి. కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు! కాబట్టి పాలు ఖచ్చితంగా శాఖాహారమే !
అయితే దీనికి ఒక నియమం చెప్పారు. ఉద్భిజములను’ ( మొక్కలు ) తిని బ్రతికే ’జరాయుజముల’ పాలుమాత్రమే శాఖాహారం – అంటే గడ్డితిని పాలిచ్చే ఆవు, గేదె పాలు శాఖాహారం. కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు ’మాంసాహారం – అంటే ఆవును తిని పాలిచ్చే పులిపాలు మాంసాహారమే!. మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’.
” గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే ” !
Sterile Egg అనేదాన్ని కొన్ని రసాయనాలను ఉపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది. ఆ గుడ్డులో నుండి పిల్ల బైటికిరాకుండా రసాయనాలువాడి, పైగా పిల్లరాదుగదా అది శాఖాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.
కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో – దానిని తినడం మాంసాహారం. గుడ్డు ఖచ్చితంగా మాంసమే కానీ పాలు శాఖాహారం.
ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకోగలుగుతుందో అది శాఖాహారం.
చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి. కదలిక కలిగినటువంటివి. కాబట్టి చేపలవంటివిగూడా మాంసాహారంక్రిందకే పరిగణించబడుతుంది. ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. లేడులు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చికమేస్తాయి. పులులు, సింహములు, దుమ్ములగొండులు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి.
….
No comments:
Post a Comment
మీ అభిప్రాయం తెలియచేయండి.